ఏపీలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇళ్ల యూనిట్ విలువకు మించి అదనపు సాయం చేయడానికి నిర్ణయం తీసుకుంది. అదనపు సాయానికి అనుమతిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేశారు. కానీ వాటి నిర్మాణం మాత్రం వివిధ దశల్లో నిలిచిపోయాయి. దీంతో అదనపు సాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. ఈ అదనపు సాయం ఉత్తర్వులు గురించి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇండ్లన్నీ అసంపూర్తిగా ఆగిపోయాయని.. అటువంటి ఇండ్లను పూర్తి చేయడానికి అదనపు సాయం చేస్తున్నాట్లు పార్థ సారధి ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, పీఎం జన్మన్ పథకం.. తదితర ఇండ్లకు ఈ అదనపు సాయం వర్తిస్తుంది.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 6.16 లక్షల పేద, బిలో మిడిల్ క్లాస్ కుటుంబాలకు లబ్ధి కలగబోతోంది. దీనికోసం ప్రభుత్వం రూ. 3వేల330 కోట్ల నిధులను అదనంగా ఖర్చు చేయబోతోంది. పీవీటీజీలకు లక్ష, ఎస్టీలకు 75,000 రూపాయలు, ఎస్సీలకు 50,000 వేల రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు సాయం అందంచబోతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికి అందరికీ ఇండ్లను నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డ్వాక్రా సభ్యులకు సున్నా వడ్డీపై 35 వేల రూపాయల రుణ సౌకర్యాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని..ఆ ఇసుక రవాణా కోసం 15000 రూపాయల చొప్పున చార్జీలు అందిస్తామని కూడా మంత్రి పార్థసారథి ప్రకటించారు. ఈ జూన్ లోపు 3 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 1.25 లక్షల గృహాలను తాము పూర్తి చేసినట్లు మంత్రి ప్రకటించారు. మరో 7.35 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయని.. వచ్చే మార్చి నాటికి వాటిని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే అదనపు సాయాన్ని లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు.