తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరించింది. పర్యాటక శాఖ ద్వారా మళ్లీ తిరుమల దర్శన టికెట్ల జారీకి నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్ల జారీలో గతంలొ
అవకతవకలు చోటు చేసుకోవడంతో టీటీడీ ఈ విధానాన్ని రద్దు చేసింది.
అయితే ఈసారి పటిష్ట చర్యలతో ఈ టికెట్ల జారీ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు తీసుకునే అవకాశం కల్పించిన టీటీడీ.. ఈ మేరకు పర్యాటక శాఖ నుంచి వచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ చేసిన విన్నపానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఏపీఎస్ఆర్టీసీకి రూ.300 దర్శన టికెట్లను జారీ చేసింది. ప్రతీరోజు ఏపీఎస్ ఆర్టీసీకి 1000 టిక్కెట్లు,తెలంగాణ పర్యాటక శాఖకు 350, తెలంగాణ ఆర్టీసీకి 1000, గోవా పర్యాటక శాఖకు 100, ఇండియన్ రైల్వేకు 250, ఇండియన్ టూరిజం విభాగానికి 100, కర్ణాటక పర్యాటక శాఖకు 500, తమిళనాడు పర్యాటక శాఖకు 1000, పాండిచ్చేరి పర్యాటక శాఖకు 100 టిక్కెట్లు..మొత్తంగా 5400 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసేది.
అయితే ఈ టిక్కెట్ల జారీ ప్రక్రియలో గతంలో అనేక అవకతవకలు జరిగాయి. పర్యాటక శాఖతో పాటు ఆర్టీసీ నుంచి టిక్కెట్లు పొందిన ఏజెంట్లు ఏకంగా సోషల్ మీడియాలోనే వాటిని అమ్మకానికి పెట్టేవారు. దర్శన టికెట్లు కావాలని సంప్రదించిన వారికి 300 రూపాయల టిక్కెట్ ను 2500 రూపాయల వరకు ఏజెంట్లు విక్రయించేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో.. ప్రత్యేక బృందాల దర్యాప్తులో భారీగా అక్రమాలు వెలుగు చూసాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ పర్యాటక శాఖ టికెట్లను పూర్తిగా రద్దు చేసింది. కాగా సీఎం చంద్రబాబు తాజా నిర్ణయంతో శ్రీవారి భక్తులు హర్షం చేస్తున్నారు.