కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా.. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.. నందమూరి ఆశయ రధసారధ్యం నీదే.. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా .. అంటూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎక్కడ చూసినా ఈ పాట వినిపించేది. వినిపించడమే కాదు.. తెలుగుదేశం పార్టీ ప్రచారాలు, కార్యక్రమాలకు కార్యర్తలు అలాగే తరలివచ్చేవారు కూడా. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంగా ప్రజ్వరిల్లిన తెలుగుతేజం సగర్వంగా తెలుగు రాష్ట్రంలో విజయపతాకనెగురవేసిన దృశ్యం ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణలో అదృశ్యమైపోయింది.
సామాన్యుడి వాహనం సైకిల్ గుర్తుతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తొమ్మిది మాసాల్లోనే అనూహ్యంగా అపూర్వ ఘనవిజయాన్ని నమోదు చేసింది. నవమాసాలు మోసి తల్లి శిశువుకు జన్మనిచ్చినట్లు.. తొమ్మిదినెలల పాటు పల్లె పల్లె తిరిగి.. ప్రజల్లో కలిసి.. చైతన్యరథంపై పయనించి.. విశ్రమించకుండా శ్రమించిన ఎన్టీఆర్ కొత్త రక్తంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సేవ చేయాలనే లక్ష్యమున్న వారికి సీట్లిచ్చారు. యువకులను, విద్యావంతులను ప్రోత్సహించారు. డాక్టర్లను సైతం ఆహ్వానించారు. అదంతా గతం. రోజులు మారాయి. పరిస్థితులు మారాయి. పార్టీ ద్వారా ఎదిగిన వారు పార్టీని భ్రష్టు పట్టించారు. వారు వీరని కాదు తెలుగుదేశం పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చిన వారెందరో నేడు వివిధ పార్టీల్లో అత్యున్నతస్థాయిల్లో ఉన్నారు. కానీ.. పార్టీ మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి దిగజారిపోయింది. ఎవరేమనుకున్నా ఇందులో కీలక పాత్ర చంద్రబాబుదేనని చెప్పక తప్పదు. దానిని రెండు దృశ్యాలుగా అవలోకిస్తే..
అందులో ఒకటి.. చంద్రబాబు చేసింది ఒకటి రెండు తప్పులే కావచ్చు కానీ ఆ పార్టీకి అవే ముప్పు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు చంద్రబాబునాయుడు.. చంద్రశేఖరరరావు ఇద్దరూ తెలుగుదేశం పార్టీ వారే. పేదల పక్షపాతిగా పేరున్న పీజేఆర్కు కంచుకోటగా ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జెండాను రెపరెపలాడించేందుకు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు 1999లో ఒక ప్రయోగం చేశారు. అప్పట్లో ఆ నియోజకవర్గం దాదాపుగా ఇప్పటి ఐదు నియోజకవర్గాలతో సమానం. సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన కె. విజయరామారావును రాజకీయాల్లో దింపారు. ఖైరతాబాద్లో పీజేఆర్ను ఓడించి చరిత్ర సృష్టించారు. అందుకు గుర్తింపుగా విజయరామారావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తత్ఫలితంగా అదే సామాజిక వర్గానికి చెందిన కె. చంద్రశేఖరరావుకు అంతకు ముందు ఉన్న మంత్రిపదవి పోయింది. డిప్యూటీ స్పీకర్కు పరిమితం కావాల్సి వచ్చింది.
మరొకటి ఏంటంటే.. కేసీఆర్కు మంత్రి పదవి వచ్చి ఉంటే టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పుట్టేదో లేదో తెలియదు కానీ రాకపోవడం వల్లనే ఏర్పడిందని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తెలుగుదేశానికి తెలంగాణలో ప్రాభవం తగ్గింది.2014లో కేవలం 15 సీట్లకే పరిమితమైంది. గెలిచినవారు సైతం బీఆర్ఎస్ పంచన చేరారు.తెలిసో తెలియకో.. పొరపాటో గ్రహపాటో కానీ కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు స్వయంకృతాపరాధంతోనే చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్రంపై దృష్టి సారించారని పరిశీలకులు చెబుతారు. జరిగిందేదో జరిగింది.. రాష్ట్రాలు వేరయ్యాక గెలిచిన రాష్ట్రంలో పాలన చేసుకోక చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో దూరి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుతో అడ్డంగా బుక్కయిపోయారు. తెలంగాణలో నిలవలేక పోయారు. అప్పటినుంచి ప్రారంభమైన తెలుగుదేశం పతనం తాజాగా పతాకస్థాయికి చేరుకుంది. తెలంగాణలో కనీసం పోటీచేయలేని దుస్థితిలో కూరుకుపోయింది. భవిష్యత్ లో టీడీపీ తెలంగాణలో మళ్లీ పుంజుకుంటుందనే ఆశలూ కనిపించడం లేదు. ఇప్పటి దాకా పార్టీని అంటిపెట్టుకున్న వారు ఇక తమ దారి తాము చూసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE