ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా నిన్న కేరళ చేరుకున్న పవన్.. మూడు రోజులపాటు కేరళతో పాటు కర్ణాటకలో గల ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు . ఆయన వెంట కుమారుడు అకిరా నందన్ కూడా ఉండటం ప్రత్యేకత సంతరించుకుందది. ఫిబ్రవరి 12న హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయంలో దిగిన పవన్.. అక్కడ నుంచి నేరుగా అగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు.మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన ఉంటుంది. అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు వార్తలు వినిపించాయి. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోనే పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు చిక్కడం లేదు. కర్ణాటకలో అధికారాన్ని చేజార్చుకున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం మెల్గగా బలం పెంచుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రత్యేక ఆలోచనతో ముందుకెళ్లిన బీజేపీ.. పొత్తుల ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ కేరళతో పాటు తమిళనాడులో కాస్త కూడా ప్రభావం చూపలేకపోతోంది . దీంతోనే ఇప్పడు పవన్ ద్వారా అక్కడ హిందుత్వ వాదాన్ని తెరపైకి తేవాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఆలయాల సందర్శన పేరుతో రాజకీయ వ్యూహం రూపొందించినట్లు ప్రచారం నడుస్తోంది.
కాగా తిరుమలలో వివాదం విషయంలో మొదట నుంచి కూడా పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఒక బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పారు. దీని తరువాత ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరగగా.. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చారు. అక్కడ వారంతా కూడా హిందూ మత పరిరక్షణ గురించి మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. పవన్ ఎలాంటి డిమాండ్లు చేశారో.. వారంతా కూడా అటువంటి డిమాండ్లు చేశారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఆలయాల సందర్శన వెనుక కూడా బీజేపీ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ తొలి రోజు ఆలయాల సందర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాన్.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆలయాల సందర్శన కేవలం తన వ్యక్తిగత పర్యటనగా అభివర్ణించారు. రాజకీయాలకు దీనికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేవలం తన మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రమే తాను ఆలయాల సందర్శనకు వచ్చినట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.