ఆ పార్టీలోనే కేశినేని నాని రీ ఎంట్రీ ..

Keshineni Nanis Re Entry

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని.. తీవ్ర మనస్తాపంతో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే నాని మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.. పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు అనుచరులను తరచూ కలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కేశినేని నాని రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో కూడా తట్టుకొని .. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని విజయాన్ని సాధించారు. అయితే ముందుగా సొంత నేతలకు విభేదించడం ప్రారంభించిన నాని..చంద్రబాబుతో కూడా విభేదించడం ప్రారంభించారు. ముఖ్యంగా లోకేష్ నాయకత్వానికి ఎదురు తిరగడంతో..ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది టీడీపీ అధిష్టానం. దీనిని తట్టుకోలేక పోయిన కేశినేని నాని.. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ నానిని సాదరంగా ఆహ్వానించి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ ఎన్నికలలో సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓడిపోవడంతో.. మనస్థాపానికి గురై ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారు. కానీ తాజాగా జరిగిన పరిణామాలతో నాని తిరిగి యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పర్యటనలు చేస్తూ.. పాత మిత్రులను కలుస్తున్నారు. వారితో మరోసారి బరిలో దిగుతానని వారితో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నానికి టీడీపీలో తలుపులు మూసుకుపోయాయి. ఎన్నికల చివరి నిమిషంలో పార్టీని ఇరుకునపెట్టి మరీ వైసీపీలో చేరడంతో.. టీడీపీ శ్రేణుల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. కాకపోతే రెండుసార్లు ఎంపీగా టీడీపీ నుంచే ప్రాతినిధ్యం వహించడంతో..నానికి టీడీపీ కేడర్ తో మంచి అనుబంధం ఉంది. కానీ నాని రీ ఎంట్రీకి చంద్రబాబు ఓకే అన్నా కూడా.. లోకేష్ మాత్రం నానిని పార్టీలోకి చేర్చే అవకాశమే లేదన్న వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాని బీజేపీలో చేరడానికి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని .. బీజేపీ అగ్రనేతలతో ఉన్న మంచి రిలేషన్ వల్ల అప్పుడు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం నడిచింది. ముఖ్యంగా నితిన్ గడ్కరి, రాజ్ నాథ్ సింగ్ తో నాని చాలా సన్నిహితంగా ఉంటారు . అయితే ఇప్పుడు రీ ఎంట్రీ కోసం వారితో చర్చలు జరిపారని.. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా నానిని పార్టీలోకి తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.