వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం సోమవారం నాడు విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో రాణించిన వారికీ పలు అవార్డులు ఇచ్చి సత్కరిస్తుందని, ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ అవార్డులను నెలకొల్పడం జరిగిందన్నారు.
డా.వైఎస్ఆర్ పేరు చెప్తే ప్రజలకు ఎన్నో విషయాలు గుర్తుకు వస్తాయని, నిండైన పంచెకట్టుతో ఆయన ప్రజల గుండెల్లో నిలిచారని చెప్పారు. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుందని చెప్పారు. భూమి మీద ఉండి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన మహామనిషి వైఎస్ఆర్ అని చెప్పారు. అందువలనే ఆయన పేరుమీద రాష్ట్రస్థాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను అందించాలని వైఎస్ఆర్ లైఫ్ టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. లైఫ్ టైమ్ ఏచీవ్మెంట్ అవార్డు పొందిన వారికి రూ.10 లక్షల నగదు, కాంస్య విగ్రహం, యోగ్యతా పత్రం, అలాగే ఏచీవ్మెంట్ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు నగదు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందిస్తామని చెప్పారు. ఈ అవార్డులను ప్రతి ఏడాది నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ , సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా 29 మంది వైఎస్ఆర్ లైఫ్ టైం ఏచీవ్మెంట్, 30 మంది వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ