ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. జూలై 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, 12న ఈ సంవత్సరపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ కి తెలియజేసినట్టు సమాచారం.
ఎన్నికల ప్రచార సమయంలో నవరత్నాలుకు సంబంధించి ఇచ్చిన హామీలు,వాటి కేటాయింపులు పై చర్చించినట్టు సమాచారం. ఇటీవలే కేంద్రప్రభుత్వం 2019-20 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టింది, అందులో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం,విభజన హామీలు విస్మరించడం గురించి కూడ చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కనబెట్టడం, అదనపు నిధులు కేటాయించకపోవడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాలపై ఈ భేటీలో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. గత నెలలో కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జగన్ భేటీ అయ్యి, ఎంతోకాలంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పై చర్చలు జరిపారు.