మంగళవారం పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖతో ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో అధికారులు చంద్రబాబు దృష్టికి కొన్ని కీలక విషయాలను తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ అధికారులు సీఎంకు వివరించారు.
ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడగగా.. అవి లేవని అధికారులు చెప్పడంతో సీఎం షాక్ అయ్యారు. కనెక్షన్ల సొమ్ములను కూడా గత ప్రభుత్వం దోచుకుందా అంటూ ఆశ్చర్యపోయారు. దీనిపై చర్యలు తీసుకుంటూ అన్ని రకాల కార్పొరేషన్లలో వెంటనే ఆడిటింగ్ చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రివ్యూలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ మొత్తాన్ని.. కడప వైసీపీ కార్యకర్తలతో నింపేయడాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది.
అంతేకాదు..సగం మంది ఉద్యోగులు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పని చేయకుండానే జీతం తీసుకున్నట్లుగా ఈ రివ్యూలో తేలింది. ఫైబర్ నెట్ పేరుతో ఏకంగా 1500 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొని..ఆ డబ్బులను పక్కదారి పట్టించారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల మంత్లీ ఛార్జీల డబ్బులను కూడా వారివారి సొంత ఖర్చులకు వాడేసుకున్నారని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీజ్ చేసి ఉన్న ఆ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని వెంటనే తెరిచి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలంటూ చంద్రబాబు వారికి ఆదేశించారు.
అలాగే ఫైబర్ నెట్ కనెక్షన్లు 9 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయినట్లు సీఎంకు అధికారులు వివరించారు. మరోవైపు.. పోర్టుల నిర్మాణ పనులపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే కాంట్రాక్టర్ విషయంలో అభ్యంతరాలున్నా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయలేమని చంద్రబాబు చెప్పారు. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధికారులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.