ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కలిసి కర్నూలు ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఈ ఎయిర్పోర్టును నిర్మించింది. ప్రారంభం అనంతరం ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మార్చి 28 నుండి కర్నూలు ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ముందుగా ఇక్కడ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు విమానాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కర్నూలులోని ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఎయిర్పోర్టులు ఆరుకు చేరుకున్నాయన్నారు. 110 కోట్ల ఖర్చుతో అన్ని సదుపాయాలతో ఏడాదిన్నరలోనే విమానాశ్రయ పనులు పూర్తిచేసి ప్రారంభించామని తెలిపారు. మొదటి స్వాతంత్య్ర పోరాటమని చరిత్రకారులు చెప్పిన 1857 సిపాయి తిరుగుబాటు కన్నా ముందే 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఈ కర్నూల్ గడ్డనుంచే వచ్చాడని చెప్పారు. ఆయనకు నివాళిగా ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ