కాస్త తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వరుణుడు రెండు రోజులు తన ప్రతాపం చూపించడంతో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు కూడా తోడు కావడంతో కొల్లేరు సరస్సులో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక,మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తాజాగా మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక ఏలూరు, కైకలూరు రహదారిపై ఆరు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు, అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాలనుకునేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటు వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాలలోని పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటిమట్టం క్రమంగా పెరిగిపోతుండంతో.. స్థానికులతో పాటు రైతులు ఏ క్షణాల ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మరోవైపు.. కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్వా రైతుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. బుడమేరు తీసుకొచ్చిన వరదకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో చెరువులు ముంపు బారిన పడగా.. మరిన్ని చెరువులకు బుడమేర వరద ముంపు భయం పొంచి ఉంది. ఒక్కో అంగుళం నీటి మట్టం పెరగుతుంటుంటే కొల్లేరు, లంక ప్రాంతాల్లోని ఆక్వా రైతులు హడలిపోతున్నారు.
తెగిపోయిన బుడమేరు మూడు గండ్లను అధికారులు పూడ్చడంతో.. ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుతుంది.దీంతో మొత్తంగా విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద.. ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోందని స్థానికులు వాపోతున్నారు.