ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తప్పించేందుకు సులువైన విధానాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీ లోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఏపీ ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొట్టు సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. భక్తులకు సౌకర్యవంతమైన దేవుని దర్శనం, అలాగే దేవాదాయ శాఖ అందించే సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి దీనిని అనుసరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి విజయవాడ లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టిక్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 10 ఆలయాల్లో ఆన్లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక పదోన్నతులపై కసరత్తు ప్రారంభించామని, ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులకు డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి లభించిందని తెలిపారు. అక్టోబరు 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం జరగనుందని, ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని స్పష్టం చేశారు.
ఇక ఇంద్రకీలాద్రిపై 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లను గురించి వివరిస్తూ.. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైమ్ స్లాట్ను కేటాయిస్తున్నామని, వీఐపీలకు ఐదు స్లాట్లలో దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో వీఐపీల కోసం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మొత్తం ఐదు స్లాట్లను కేటాయించామని వెల్లడించారు. అంతరాలయ దర్శనానికి ముఖ్యమంత్రి, గవర్నర్ మరియు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే అనుమతించబడతారని స్పష్టం చేశారు.
ఆన్లైన్ సేవలు అందించనున్న ప్రధాన ఆలయాలు ఇవే..
- శ్రీ వరసిధి వినాయక స్వామి ఆలయం (కాణిపాకం)
- శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం (శ్రీకాళహస్తి)
- శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం (శ్రీశైలం)
- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (విజయవాడ)
- శ్రీ వీర వెంకట సత్యనారాయణ ఆలయం (అన్నవరం)
- శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం (పెనుగంచిప్రోలు)
- శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం (సింహాచలం)
- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (వాడపల్లి)
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం (ద్వారకా తిరుమల)
- శ్రీ కనక మహాలక్ష్మీ ఆలయం (విశాఖపట్నం)
- శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం (ఐనవల్లి).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ