Video: లోకేష్ చేసిన ఆ ఒక పనితో తారక్ అభిమానులు ఖుషీ

ఒకప్పుడు లోకేష్ పప్పు అన్నవారి నోట నుంచే ఇప్పుడు లోకేష్ రాజకీయాలలో బాగా రాటుదేలారన్న మాటలు వింటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా అనేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడటం, అందరితో కలుపుకొని పోవడం, విమర్శలకు తన చేతలతోనే సమాధానం చెప్పడం ఇలా .. లోకేష్‌లో ఇప్పుడు చాలా మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు , తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించిన మంత్రి నారా లోకేష్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు తనకు మధ్య గ్యాప్ లేదన్న విషయాన్నిమరోసారి ప్రూవ్ చేశారు.

గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో బుధవారం .. అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే ముందుగా ఆ మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం దగ్గర టీడీపీ శ్రేణులు మంత్రికి స్వాగతం పలికాయి. మంత్రి లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తారక్ ఫ్లెక్సీలతో అక్కడికి వచ్చారు. అయితే టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోరికతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి లోకేష్ కొద్దిసేపు పట్టుకోగా వారు కేరింతలు,ఈలలతో సందడి చేశారు. ఈ వీడియోను వైరల్ చేస్తున్న తారక్ అభిమానులు లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజానికి టీడీపీలో లోకేష్ ఎదగడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అయితే అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలపైనే ఫోకస్ పెట్టి.. టీడీపీతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. దీంతో నందమూరి వారసుడు అయిన ఎన్టీఆర్‌ను లోకేష్ కోసం పక్కన పెట్టేస్తున్నారన్న ఆరోపణ ఉంది.

అయితే దీనిని చాలాసార్లు ఖండించిన లోకేష్. అటువంటిదేమీ లేదని.. తమ మధ్య మంచి వాతావరణం ఉందని చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ పుట్టినరోజు, సినిమా వేడుకలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు లోకేష్ చేసిన పని అలాంటి ఆరోపణలకు చెక్ పెట్టినట్లయింది.
జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని సంకేతాలను తారక్ అభిమానులకు పంపడంతో ఇటు టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.