సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఏపీ ఓటర్లు వైసీపీకి వాతలు పెట్టినా ఆ నేతల తీరు మాత్రం ఏమాత్రం మారలేదంటున్నారు విశ్లేషకులు. తాజాగా బిల్లులు కావాలంటే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ నేతలు అవసరమన్న విషయాన్ని కమలం పార్టీ గుర్తుపెట్టుకోవాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పి.విజయసాయి రెడ్డి హెచ్చరించడం ఇదే కోవకు చెందుతుందని అంటున్నారు. తాము ఆంధ్రాలో అధికారం కోల్పోయినా కూడా తమకు ఇంకా లోక్సభ, రాజ్యసభల్లో 15 మంది ఎంపీలు ఉన్నారని, టీడీపీకి తమకంటే ఒక్క ఎంపీనే ఎక్కువని ఆయన లెక్కలు చెప్పి మరీ చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి అయినా కూడా రాజ్యసభలో తమపైనే ఢిల్లీ పెద్దలు ఆధారపడాల్సి ఉంటుందన్న విషయాన్ని ఆయన హైలెట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి
విజయసాయిరెడ్డి ప్రకటన తర్వాత సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారట. విజయసాయి రెడ్డి బీజేపీని బెదిరించారా..? లేక తమ ఎంపీల లెక్క చెప్పి వీరిని తీసుకుంటే బాగుంటుందని బేరం పెడుతున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం నుంచి మద్దతు లేనప్పుడు కేంద్రంతో అయినా సయోధ్యగా ఉండాల్సింది పోయి ఇలా నోరు పారేసుకోవడం ఏంటని వైపీపీ నేతలే షాక్ తిన్నారట.
నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని విజయసాయి రెడ్డి..ఇటీవల నెల్లూరు ఎంపీ సీటులో దారుణంగా ఓడిపోయారు. అయితే రాజకీయ నాయకుడి కంటే లాబీయిస్టు అనే పేరే ఎక్కువగా విజయసాయికి వుంది.అయితే తెరచాటు రాజకీయాలకు పెట్టింది పేరైన విజయసాయి రెడ్డి కేంద్రంలో బలంగా వున్న బీజేపీని బెదిరించడమంటే..ఇప్పుడున్న పరిస్థితులలో వైఎస్ జగన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టడమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోదీ పాలనలో కాదు సీబీఐ, ఈడీ పాలనలో ఉందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే ఆరోపిస్తుంటాయి. ఒకవేళ అదే నిజమనుకొంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు బెదిరింపులకు దిగిన విజయసాయి రెడ్డిపై కూడా ఈడీ, సీబీఐ కేసులు విచారణలోఉన్నాయి. మరో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అదే బీజేపీ దయతో సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకొన్నారు.అంతేకాకుండా మరో ఎంపీ మిధున్ రెడ్డిపై ఈడీలో ఫిర్యాదులున్నాయి.
కానీ ఇవన్నీ పట్టనట్లు, కనీస ఇంగితం లేకుండా విజయసాయి రెడ్డి కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు హెచ్చరికలు జారీ చేసి ఇలా ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థం కాలేదని వైసీపీ వర్గాలు మదనపడుతున్నాయి. ఇలాంటి వారందరికీ ప్రాధాన్యత ఇచ్చే.. జగన్ ఇప్పుడు కేవలం 11 స్థానాలకు పరిమితమయ్యారని, వీరిని ఇలాగే ప్రోత్సహిస్తే పార్టీకి ఇబ్బందులు, నేతల అరెస్టులు తప్పకపోవచ్చని సొంత పార్టీ నేతలు కలవర పడుతున్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ ఓటమికి జగన్తో పాటు విజయసాయి వంటి నేతల అహంకారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. జనాలు అవినీతిని అయినా భరిస్తారు కానీ అహంకారాన్ని మాత్రం భరించరని తెలంగాణ, ఆంధ్రా అసెంబ్లీ ఫలితాలే నిరూపించాయంటూ ఇప్పటికీ విశ్లేషకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఓడిపోయాక అయినా బుద్ది తెచ్చుకోవాల్సింది పోయి అదే అహంకారంతో మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ పెద్దాయనకు తెలీదా అన్న కామెంట్లు ఇటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE