టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జనవరి 6, 7, 8 తేదీలలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు టీడీపీ పార్టీ ప్రకటించింది. ముందుగా జనవరి 6న రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి ప్రజలను కలుసుకోనున్నారు. జనవరి 7, శుక్రవారం ఉదయం కుప్పంలోని ప్రాంతీయ వైద్యశాలలో ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం దాసేగానూరు, గుట్టపల్లెలో చంద్రబాబు పర్యటించనున్నారు.
ఇక జనవరి 8, శనివారం నాడు గుడిపల్లి మండలం శెట్టిపల్లి, జాతకర్తపల్లి గ్రామాలు, శాంతిపురం మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా పార్టీ కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కున్న నేపథ్యంలో చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ కేడర్ లో తిరిగి నూతన ఉత్తేజం నింపడం, స్థానికంగా సమస్యల పరిష్కారం దిశగా ఈ పర్యటన సాగనున్నట్టు తెలుస్తుంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ