వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్లూ రామ్ గోపాల్ వర్మ తెగ రెచ్చిపోయాడనే చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. కేసుల నుంచి బయటపడటానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాడు. వైసీపీ హయాంలో ఒకవైపు వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో జగన్ ప్రత్యర్థులపై విరుచుకుపడేవాడు. ఈ వ్యూహం మూవీ ప్రమోషన్ లో భాగంగా అప్పుడు ఆర్జీవీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు బాగా వివాదాస్పదం అయ్యాయి.
వైసీపీ అధికారంలోకి ఉండడంతో వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేక ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులు జరుగుతుండటంతో.. రామ్ గోపాల్ వర్మ పైన కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం పోలీసులు.
అయితే ఆర్జీవీ మాత్రం విచారణకు హాజరు కాలేదు పైగా తనపై వేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టును కోరాడు. అది వీలు కాదని తేల్చి చెప్పిన ధర్మాసనం..కాకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని చెప్పింది. దీంతో రెండు రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు..వారం రోజులపాటు వర్మని అరెస్టు చేయవద్దని తీర్పు ఇచ్చింది.అయితే ఇలాంటి సమయంలోనే ఆర్జీవీ విషయంలో సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది.
వైసీపీ ప్రభుత్వం నుంచి వర్మ భారీగానే లాభం పొందినట్లు తెలుస్తోంది.వర్మ పోస్టులకు గాను ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నెల నెల జీతంగా చెల్లింపులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు.
యూట్యూబ్ లతో పాటు వెబ్సైట్ల పర్యవేక్షణ చూడటం ఈ కార్పొరేషన్ బాధ్యత. అప్పుడే వైసీపీ అనుకూల మీడియా యూట్యూబర్లకు, సోషల్ మీడియాలో వైసీపీ ప్రత్యర్థులపై విరుచుకు పడే వారికి పెద్ద ఎత్తున నగదు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే రాంగోపాల్ వర్మ కు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి భారీగా చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక ఇటు వర్మ విషయం చూస్తే.. పదేళ్లుగా ఆయన వైసీపీకి అనుకూలంగా పొలిటికల్ కంటెంట్తో చాలా సినిమాలు తీశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, శపధం వంటి సినిమాల్లో అయితే జగన్ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చూపించాడు.అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబును నెగిటివ్ కోణంలోనే చూపించాడు.
అయితే ఈ సినిమాలకు కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచే నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రాలకు నిర్మాతలు , నిర్మాణ సంస్థలు కూడా ఉన్నా.. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వర్మకు ఎలా చెల్లింపులు చేశారన్నదే సస్పెన్స్ గా మారింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి కంటెంట్ రైటర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్ రూపంలో ఈ చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దీనిపైన కూటమి ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేసే పనిలో పడింది. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు విషయంలో త్వరలోనే సంచలన విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.