అమరావతి ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

Police heavily-deployed in the Villages of Capital Amaravati

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఆందోళనల నేపథ్యంలో ఏర్పడుతున్న ఉద్రిక్తపరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో 26వ రోజున నిరసన దీక్ష చేసేందుకు వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి నిరసన దీక్ష కోసం టెంట్‌ వేసేందుకు అనుమతిని నిరాకరించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులను వెనక్కి పంపుతున్నారు. తుళ్లూరు, మందడంతో పాటుగా ఇతర రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీస్ పికెటింగ్, 144 సెక్షన్‌, 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపేందుకు అనుమతిలేదని, ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ మైక్ లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు రాజధాని ప్రాంత గ్రామాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించడంపై ట్విట్టర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ” రైతు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా? ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి ఉద్యమాన్ని అణిచివేయాలని అనుకోవడం సీఎం వైఎస్ జగన్ అవివేకం. గ్రామస్థులను ఇళ్లలో బందిస్తారా? ఇంత ఘోరం మరొకటి ఉండదు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో యుద్ధ వాతావరణం తీసుకొచ్చినందుకు వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని” నారా లోకేష్ హెచ్చరించారు.

[subscribe]