ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు చెప్పింది. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ తప్పకుండా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ సమావేశలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతుల గురించి మంత్రి ఆరా తీసారు. ఆ తర్వాత అధికారులకు అచ్చెన్నాయుడు కొన్ని కీలక సూచనలు చేశారు. ఇటీవల అధిక వర్షాల వల్ల వరినారు, నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై తాము వరి విత్తనాలను పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏపీలోని అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33వేల హెక్టార్లలో వరినారు మళ్లు దెబ్బతిన్నట్లు అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకువచ్చారు. ఇలా నారు, నారుమళ్లు నష్టపోయిన రైతన్నల కోసం 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆయన అన్నారు.
బాధిత రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల దగ్గరకు వెళ్లి రాయితీ వరి విత్తనాలు పొందొచ్చని మంత్రి అచ్చెన్నాయుడు వారికి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం ముంపు ప్రాంతాలలో పర్యటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన బుద్ధి మార్చుకోవడం లేదని విమర్శించారు.
ఐదేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు మాత్రం ఏపీలో ఏదో తప్పులు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారానికి రెడీ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీప పాలనలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాలకులపై దాడులు జరుగుతూనే ఉండేవని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్లలో పెద్ద ఎత్తున ఎవరు దోపిడీకి పాల్పడ్డారో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.