ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, రావాల్సిన బకాయిలు, విభజన హామీలు, పరిష్కారం కాని వివిధ సమస్యలు సహా మొత్తం 17 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి, సీఎం వైఎస్ జగన్ వివరించనున్నట్టుగా సమాచారం. ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చివరిసారిగా ఫిబ్రవరిలో భేటీ అయ్యారు. దాదాపుగా 8 నెలల అనంతరం ఈ రోజు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని పెద్ద స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ నుంచి గాని, వైసీపీ నుంచి గాని అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ఇక ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, జలవనరుల శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu