ఒకవైపు ఎండలు .. మరోవైపు వానలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం,నంద్యాల, అనంతపురం, కోనసీమ,తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రేపు విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయిజిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను ఒకసారి చూస్తే.. కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కడప జిల్లా అమ్మలమడుగులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత, అమరావతిలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులపైన వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలోమ ప్రస్తుతం వాతావరణంలోని మార్పులతో పగలు భయంకరంగా ఎండలు, రాత్రి పూట వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. ఇక ఉత్తర భారత నుంచి దక్షిణ భారతం వైపు పొడి వాతావరణంతో కూడిన ఈదురు గాలులు వీస్తున్నట్లు తెలిపారు. ఇక.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.