జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ పై సుప్రీం ఆగ్రహం

వైసీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్ పై దాఖలవుతున్న వివిధ రకాలైన ఫిటిషన్లతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా ఆదేశించారు.
ఈ కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న పిటిషన్లతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణ కోసం వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులపై జస్టిస్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకుండా, దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు.

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, కాబట్టి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామ తరపు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ.. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతీ లేదన్నారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి గురవుతారని పేర్కొన్నారు. జస్టిస్ ఖన్నా స్పందిస్తూ తాను సీబీఐ నివేదిక చూశానని, బాధ కలిగించిందని చెప్పారు. విచారణ కోర్టులో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇతరత్రా విషయాల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు. సీబీఐ.. ప్రత్యేక న్యాయవాదిని పెట్టుకోవాలి. జగన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతీ వాదిస్తూ ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల దస్త్రాలు ఉన్నాయని చెప్పారు. కేసుల విచారణలో అలాంటివన్నీ ఉంటాయని, అందువల్ల సీబీఐ ఈ కేసు కోసమే ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని జస్టిస్ ఖన్నా సూచించారు. కేసు విచారణ జాప్యానికి కారణాలు చెప్పవద్దని, మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కేసును నవంబర్‌కు ప్రారంభమయ్యే వారానికి విచారణను వాయిదా వేశారు.