గుడివాడలో పేదల ఇళ్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపిస్తే, రాజకీయాలు వదిలేస్తా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి రోజున చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని, గుడివాడలో అభివృద్ధిపై ఆయనతో చర్చకు తాను సిద్ధమని తెలిపారు. 14 ఏళ్ళు గుడివాడ గురించి పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తానంటే ఇక్కడెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో 23వేల మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నామని, చంద్రబాబు హయాంలో గుడివాడలో పేదల ఇళ్ల కోసం ఒక్క ఎకరం అయినా కొన్నారా? అని ప్రశ్నించిన కొడాలి నాని.. కొన్నట్లు నిరూపిస్తే, తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు.
ఇక గుడివాడలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన ప్రతిసారీ టీడీపీ అభ్యర్థి ఓడిపోయారని, 1999, 2014లో రావి వెంకటేశ్వర రావు, 2019లో దేవినేని అవినాష్ లను గెలిపించాలని కోరారని, వారిని తాను ఓడించానని తెలిపారు. అయితే 2004, 2009లో టీడీపీ తరపున తాను పోటీ చేసినా.. తన తరపున చంద్రబాబు ప్రచారం చేయలేదు కాబట్టే తాను గెలిచానని చెప్పారు. గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు ఎందుకు కట్టలేకపోయారు? అని ప్రశ్నించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది తాను, జూనియర్ ఎన్టీఆర్ అని, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు వచ్చి ఆ విగ్రహాలకు దండాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది కేవలం సీనియర్ ఎన్టీఆర్, ఆయన కుమారుడు హరికృష్ణ, మనవడు జూ. ఎన్టీఆర్లకు మాత్రమేనని, నందమూరి కుటుంబంలోని వారిలో జూనియర్ ఎన్టీఆర్కు తప్ప మరెవరికీ నిమ్మకూరులో ఆస్తులు లేవని కొడాలి నాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE