ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 27, బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీవరకు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే సభ ఎన్ని రోజులు జరగాలి, ఏయే అంశాలు చర్చించాలి అనే దానిపై సమావేశాల ప్రారంభ రోజున జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బుధవారం నాడు అసెంబ్లీలోని వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్లు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎం.జగన్మోహన్రావు, జోగి రమేష్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ప్రతిపక్షాన్ని వ్యూహత్మకంగా ఎదుర్కోంటూ, ఎవరూ ఏ అంశంపై మాట్లాడాలి, ఏ ఎమ్మెల్యేలకు ఏ అంశాలను కేటాయించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించే వైసీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని కూడా శాసనసభ , శాసనమండలి సమావేశాల ప్రారంభం రోజునే నిర్వహించాలని నిర్ణయించారు.
[subscribe]