ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని కూటమి ప్రభుత్వం తాజాగా సడలించింది. ఎన్డీయే సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 31 వరకూ ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకూ బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో భాగంగా ఉన్న.. ఉద్యోగుల బదిలీల గడువును సెప్టెంబర్ నెల 15 వరకూ పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగిసిపోనుంది.
దీంతో ఈ ఉద్యోగుల బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు మరో 15 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 15 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటితో ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తోంది.
అయితే ఇంకా కొన్ని కీలక శాఖల్లో ట్రాన్స్ఫర్లకు ప్రభుత్వం ఇప్పటివరకూ మార్గదర్శకాలను రిలీజ్ చేయలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు జరగలేదు. బదిలీ జరగని శాఖల్లో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. దీంతో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా బదిలీలు లేనట్లేనన్న వాదన వినిపిస్తోంది. అలాగే రవాణా శాఖలో ఆరోపణల వల్ల బదిలీల మార్గదర్శకాల విడుదలకు కూడా ప్రభుత్వం బ్రేక్ వేసింది.