ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ జీవితం ముగిసిందని, ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు జనవరి 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తీసుకున్నదని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదని, వేరే పదవిలో లేదా ప్రయోజనంలో ఆశపడలేదని క్లారిటీ ఇచ్చారు.
వైఎస్సార్ కుటుంబానికి తన జీవితమంతా రుణపడి ఉంటానని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా వైఎస్ కుటుంబం తనను నమ్మి ఆదరించిందని, రాజ్యసభకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన జగన్కి, తనను ఉన్నత స్థాయికి చేర్చిన వైఎస్ భారతమ్మకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
తన రాజకీయ ప్రయాణంలో పార్టీ ప్రయోజనాల కోసం, కేంద్ర-రాష్ట్రాల మధ్య వారధిలా పనిచేసినట్టు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పూర్తి నిబద్ధతతో పనిచేశానని విజయసాయి రెడ్డి తెలిపారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎనిమిదేళ్లుగా వాళ్ల ప్రోత్సాహంతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందినట్టు వివరించారు. టీడీపీతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని చెప్పారు.
తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనను ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంచలన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 2028 వరకు రాజ్యసభ పదవి గడువు ఉండగా, ఇంత త్వరగా రాజీనామా చేయడానికి కారణాలపై చర్చ జరుగుతోంది.