ఏపీలో ఫలితాలు విడుదల అయిన దగ్గర నుంచి ఒకటే చర్చ నడుస్తోంది. జగన్ అండ్ కో ఓడిపోవడం..అందులోనూ ఘోరాతిఘోరమైన సీట్లు తెచ్చుకుని ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ఓడించారా. ఓడించే పరిస్థితిని జగన్ స్వయంగా తెచ్చుకున్నారా అన్న టాపిక్కే నడుస్తోంది. 2019 లో 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు..అయిదేళ్ల కాలంలో అదే జగన్ను 11 సీట్లకు ఎందుకు పరిమితం చేసారన్న చర్చే నడుస్తోంది. 40 శాతం ఓటింగ్ అయితే దక్కింది అయినా.. 11 సీట్లకే పరిమితం అవడాన్ని సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
2019 ఎన్నికలలో చంద్రబాబు కంటే జగన్ సమర్ధవంతంగా రాణిస్తారనే ఆశతో 151 సీట్లతో ఏపీ ఓటర్లు అతనిని ముఖ్యమంత్రిని చేసారు. అయితే అధికారం చేపట్టిన కొద్ది నెలలకే రాజధాని నుంచి అన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్న జగన్పై ప్రజల్లో అగ్రహం మొదలైంది. దీనికి తోడు జగన్ ప్రజలను ఏనాడు కలవలేదు సరికదా..కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కలిసే అవకాశమివ్వలేదు. ఇక కేడర్ గురించి ఆలోచన చేయలేదు. బటన్ నొక్కటం కోసం మాత్రమే సీఎం అయినట్లు.. ఎలాంటి సమస్య అయినా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి పరిష్కరిస్తారన్న గుడ్డి నమ్మకాన్ని జగన్ పెట్టుకోవడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. వారికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళల్లో అండగా ఉన్న కేడర్ను పట్టించుకున్న పాపాన పోలేదు.
దీనికి తోడు జగన్ ప్రజల మూడ్ తెలుసుకొని తమను అలర్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఐప్యాక్.. పూర్తిగా జగన్ కళ్లకు గంతలు కట్టేసింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో జగన్కు మరోసారి 151 సీట్లపైన చివరి వరకూ ఆశలు కల్పిస్తూ టైమ్ చూసుకుని ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ప్రజలు, పార్టీ నేతలతో జగన్ ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారో..అప్పుడే ఎలాంటి నిజాలు కూడా ఆయన వద్దకు చేరలేదు. అందుకే బయట జరుగుతున్న ప్రచారాన్ని జగన్ సీరియస్ గా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా కరోనా సమయంలో సమర్దంగా వ్యవహరించిన జగన్.. ఆ తరువాత మాత్రం పాలనను గాలికి వదిలేసి ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టడానికి మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రేరేపించడానికే వెచ్చించారన్న మాటను మూటగట్టుకున్నారు.
అంతేకాకుండా ప్రజలకు నేరుగా ఖాతాల్లో డబ్బులు వేయటం, వాలంటీర్లే వైసీపీ సైన్యంగా జగన్ ఆలోచన సాగింది తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినా, నిరుద్యోగులు పెరిగిపోయినా.. ఇవన్నీ జనాలకు ఫ్రీగా డబ్బులిస్తున్నాం కాబట్టి ఇవేమీ పట్టించుకోరన్న ధీమాను పెంచుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన జగన్.. సజ్జలకు ఆ బాధ్యతను అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అదుపు తప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇలా ఈ ఐదేళ్లు జగన్ పరిపాలనతో విసిగిపోయిన ఓటర్లు అవకాశం కోసం కాచుకుని మరీ.. సైలెంట్గా వైసీపీ వర్గానికి ఓటమిని రుచి చూపించారు. మొత్తంగా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లే ఇప్పుడు వైసీపీ ఓటమికి అంతకు మించి కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY