ఒకప్పుడు పొట్ట కూటి కోసం మాత్రమే అడుక్కునేవాళ్లు. అయితే ఇప్పుడు యాచించడమే ఒక వృత్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉండటంతో యాచించేవారి సంఖ్య నగరాల్లో భారీగా పెరుగుతోంది. అయితే రోడ్లపై యాచకుల కారణంగా వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ఇండోర్ అధికారులు భిక్షాటనపై తాజాగా నిషేధాన్ని విధించారు. అంతేకాదు యాచకులకు సాయం చేసేవారిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి కారణం యాచకుల్లో కొందరికి సొంత ఇల్లు, వారి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించడమే.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేశంలోనే పరిశుభ్రమైన సిటీగా గుర్తింపు పొందింది. వరుసగా మూడుసార్లు అవార్డు కూడా పొందింది. దానిని కాపాడుకోవడానికే 2025 జనవరి 1 నుంచి అక్కడి ప్రభుత్వం భిక్షాటనపై నిషేధం విధించింది. యాచకులకు సాయం చేసేవారిపైన కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డోర్ను యాచకులు లేని నగరంగా మార్చడానికి న్యూ ఇయర్ నుంచి భిక్షాటనను నిషేధించారు.
ఇండోర్ను యాచకులు లేని సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ తాజాగా ఇండోర్లో భిక్షాటనపై నిషేధాన్ని విధించారు. డిసెంబర్ చివరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. భిక్షాటన చేసేవారికి ఎలాంటి సాయం చేయొద్దని నగరవాసులకు.. యాచకులను వెంటనే పునరావాస కంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.
భిక్షాటన దేశంలో పెద్ద సమస్యగా మారుతుండటంతో.. దేశంలో యాచకులు లేని సిటీలను తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా పది నగరాలను పైలట్ ప్రాజెక్టు కింద కేంద్రం ఎంపిక చేసింది. హైదరాబాద్ ,ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ముందుగా ఇండోర్ అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించారు.