భారతీయ సినీ చరిత్రలో ‘హీ-మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ (హిందీ) నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఆయన ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో నేడు (నవంబర్ 24, 2025) తుదిశ్వాస విడిచారు. ఆయన 90వ జన్మదినానికి కొద్ది వారాల ముందు ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాగా, ధర్మేంద్ర డిసెంబర్ 8న 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉంది.
పూర్తి వివరాలు
-
వయస్సు, మరణం: నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అక్టోబర్ చివరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన, 12 రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు.
-
నట జీవితం ప్రారంభం: ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1960ల్లో అన్పాద్, బందిని, అనుపమ వంటి చిత్రాల్లో సాధారణ వ్యక్తి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
-
కీలక చిత్రాలు: ఆ తర్వాత ఆయన షోలే, ధరమ్ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ‘హీ-మ్యాన్’గా గుర్తింపు పొందారు.
-
చివరి చిత్రాలు: ఆయన చివరిసారిగా షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ఇక్కిస్’, ఇది డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.
అభిమానులు, సినీ ప్రముఖుల సంతాపం
ధర్మేంద్ర మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముంబైలోని ఆయన నివాసం వద్ద అంబులెన్సులు, భద్రత పెరిగినట్లు సమాచారం. దేశీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, విభిన్న పాత్రలు, ఆరు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు.
ఇక ప్రధాని మోదీ సైతం దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, పాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
The passing of Dharmendra Ji marks the end of an era in Indian cinema. He was an iconic film personality, a phenomenal actor who brought charm and depth to every role he played. The manner in which he played diverse roles struck a chord with countless people. Dharmendra Ji was…
— Narendra Modi (@narendramodi) November 24, 2025
ఇక స్థానిక విల్లీ పార్లే శ్మశానవాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించగా.. అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అమితాబ్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి శ్మశానికి వెళ్లగా.. ఇంకా హీరోలు అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్లు కూడా శ్మశానికి వెళ్లి ధర్మేంద్రకు ఘనంగా నివాళులు అర్పించారు.
కాగా, తన ఆకర్షణీయమైన నటన, ప్రత్యేకమైన శైలితో ఆరు దశాబ్దాల పాటు భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ధర్మేంద్ర మృతి, సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.







































