రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో గురువారం నాడు పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు జేపీ నడ్డా వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రాళ్ల దాడికి పాల్పడడమే కాకుండా రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. డైమండ్ హార్బర్కు వెళ్లేసమయంలో టిఎంసి మద్దతుదారులు రహదారిని అడ్డుకుని, జేపీ నడ్డా వాహనం మరియు కాన్వాయ్ లోని ఇతర కార్లను రాళ్లతో కొట్టారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు.
అనంతరం కార్యకర్తల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, మా కాన్వాయ్లో దాడి చేయని కారు లేదని, బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్నందున తాను సురక్షితంగా ఉన్నానని అన్నారు. ఈ దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాష్ విజయవర్గియా గాయపడ్డారని చెప్పారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి అవమానమని, పశ్చిమ బెంగాల్లో ఇలాంటి పరిస్థితులకు ముగింపు పలకాలని పేర్కొన్నారు. 2021లో పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ