జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాను పీఎస్ఏ కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ ఫిబ్రవరి 10, సోమవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒమర్ అబ్దుల్లాను నిర్బందించడం రాజ్యాంగ విరుద్ధం మరియు అతని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని సారా అబ్దుల్లా చేసిన అభ్యర్థనను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.
సారా అబ్దుల్లా తరపు న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ, పీఎస్ఏ కింద అబ్దుల్లాను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ హేబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ వారంలో దీనిపైనా విచారణ జరపాలని కోర్టును కోరామని తెలిపారు. ముందుగా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాతో సహా మరికొంతమంది నేతలను కేంద్రం ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. అనంతరం వారి ఆరునెలల నిర్బంధకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా ఫిబ్రవరి 6వ తేదీన ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద మరోసారి కేసు నమోదు చేసి నిర్బంధం విధించారు.
[subscribe]