భారత్ వద్దు విదేశాలే ముద్దు అనుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో మన భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాన్ని స్వీకరించారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీల్లో స్థిరపడ్డారు.ఈ ఆరేళ్లలో 70 మంది పాకిస్థాన్, 130 మంది నేపాల్, 1,5వందల మంది కెన్యా పౌరసత్వాన్ని కూడా స్వీకరించారు. అంతెందుకు విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే ఎక్కువమంది ఉన్నట్లుగా తేలింది.సుమారు 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
విదేశాల్లో మెరుగైన ఎడ్యుకేషన్, ఉద్యోగావకాశాలు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణంతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఈ ఐదేళ్లలోనే ఏకంగా 8.34 లక్షల మంది భారతీయలు.. ఇండియాకు బై చెప్పి విదేశీ పౌరులుగా మారిపోయారు.
పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య కోవిడ్కు రాకముందు అంటే 2019కు ముందు.. సగటున 1.32 లక్షలుగా ఉండగా.. కోవిడ్ తర్వాత 2020-2023 మధ్య 20 శాతం పెరగడం విద్యావేత్తలను కూడా ఆశ్చర్యంలో పడేస్తుంది. బెటర్ ఎడ్యుకేషన్, మంచి జాబ్ కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. మెరుగైన ఆర్థిక అవకాశాలు, ప్రశాంతమైన జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం అక్కడే ఉండిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు భారత పాస్పోర్టుతో కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ వంటి దేశాల పాస్పోర్టులతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా లేకుండానే ప్రయాణాలు చేయొచ్చు. దీని వల్ల కూడా చాలామంది భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి కారణంగా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే మాత్రం భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లోలాగా ద్వంద్వ పౌరసత్వం అనేది భారత రాజ్యాంగంలో లేదు. భారత పౌరసత్వం వదులుకున్న వారంతా భారతదేశం తిరిగి రావాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. బంధువులు,కుటుంబం కోసం తరచూ ఇండియాకు వచ్చివెళ్లే వారి కోసం 2003లో పీఐవో అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పాస్పోర్టులా పదేళ్లపాటు పనిచేస్తుంది కానీ పీఐవోని 2015 నుంచి నిలిపేశారు.
2016 నుంచి జీవితకాల పరిమితితో .. ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డును జారీ చేస్తున్నారు. ఇది ఉంటే వీసా లేకుండానే భారతదేశానికి వచ్చే వీలు ఉంటుంది. ఓసీఐ ఉంటే ఇండియాలో ఉంటూనే ప్రైవేటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. భారత్ పౌరసత్వాన్ని వదిలి ఇండియాను వదిలివెళుతున్నవారి సంఖ్యను తగ్గించాలంటే భారత్ కూడా ద్వంద్వ పౌరసత్వాన్ని అమల్లోకి తీసుకురావాలని..అప్పుడే ఈ సంఖ్య తగ్గుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సూచిస్తున్నారు.