దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి సోమవారం సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించబోతుంది. ఇప్పటికీ ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం కేసు దర్యాప్తు క్లిష్టంగా మారుతోంది.
ఆగస్టు 9న మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు గురయ్యారు. హత్య, అత్యాచారం ఆరోపణలపై ఇప్పటికే కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. ముందుగా సంజయ్ రాయ్ కోల్కతా పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించినా.. లై డిటెక్టర్ టెస్టులో తాను సెమినార్ హాల్కు చేరుకున్నప్పటికే జూనియర్ డాక్టర్ చనిపోయినట్లు తెలిపాడు.
దీంతో అభయ హత్యపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. దీనిలో భాగంగా జూనియర్ డాక్టర్ని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సెమినార్ హాల్లో ఉంచారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కోల్కతా రేప్ కేసుపై సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 9న విచారణ జరగనుండగా.. ఈ కేసు దర్యాప్తు నివేదికను సీబీఐ.. కోర్టులో సమర్పించనుంది.
ఆర్జీకర్ వైద్య కళాశాల సెమినార్ హాల్లోనే అభయను హత్య చేశారా.. లేదంటే మెడికల్ కాలేజీలోని మరేదైనా రూమ్ లేదా ఫ్లోర్లో మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీని సెమినార్ హాలుకు తీసుకువచ్చారా అనే కోణంలో తాజాగా సీబీఐ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లోని కొన్ని ఫోర్లపై సీబీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎనిమిదో అంతస్థులోని స్పెషల్ సర్జరీ విభాగానికి చెందిన ఆపరేషన్ థియేటర్పై సీబీఐ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
అభయ హత్యకు, ఆర్థోపెడిక్ విభాగానికి ఉన్న లింకులపై సీబీఐ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థోపెడిక్ విభాగం, చెస్ట్ మెడిసిన్ డిపార్టుమెంట్లకు చెందిన ఫ్లోర్ మ్యాప్లను ఆధారం చేసుకుని సీబీఐ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.సెమినార్ హాల్లోని కొన్ని అంశాలను బట్టి.. ఘటనా స్థలం సెమినార్ గదా లేదా సంఘటన జరిగిన తర్వాత డెడ్ బాడీని ఆ గదికి తీసుకెళ్లారా అని నిర్ధారించడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ల్యాప్టాప్, తల, చేతులు, బెడ్ షీట్ మొదలైనవి అక్కడ అమర్చినట్లు ఉండటంతో సీబీఐ కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ తన రిపోర్టులో ఎలాంటి అంశాలను పొందుపర్చిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.