ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. ఫిజిక్స్ విభాగంలో ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాలను శాస్త్రవేత్తలు జాన్ హాప్ఫీల్డ్, జియోఫ్రీ హింటన్లు అందుకోనున్నారు. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు కు 2024కుగానూ నోబెల్ బహుమతి ప్రకటించారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లలో మెషిన్ లెర్నింగ్ను ఎనేబుల్ చేయడానికి సంబంధించిన ఆవిష్కరణకు గాను ఈ శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు ఇవ్వనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. నోబెల్ బహుమతిని స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో ఫిజిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం నాడు ప్రకటించారు.
భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్లు సృష్టించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాచారాన్ని స్టోర్ చేసి, రీ కన్స్ట్రక్ట్ చేసే విధానాన్ని జాన్ హోప్ఫీల్డ్ సృష్టించినట్లు కమిటీ వెల్లడించింది. డేటాలో ఉన్న వివిధ ప్రాపర్టీల గురించి జెఫ్రీ హింటన్ ఓ విధానాన్ని డెవలప్ చేశారు. ఆ విధానం ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను అమలు చేయవచ్చు అని కమిటీ తెలిపింది.
గత ఏడాది ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2023లో శాస్త్రవేత్తలు అన్నే ఎల్ హుయిలైర్, పీరీ అగోస్టిని, క్రాజ్లు ఆ అవార్డు అందుకున్నారు. ఎలక్ట్రాన్ల వేగంపై అధ్యయనం చేసినందుకు వాళ్లకు ఆ బహుమతి దక్కింది. కణంలోని చిన్న ఎలక్ట్రాన్లు ఎలా కేంద్రకం చుట్టు భ్రమిస్తాయన్న విషయాన్ని వాళ్లు తేల్చారు. ఇక సోమవారం నోబెల్ కమిటీ.. మెడిసిన్లో ఈ యేటి విజేతలను ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లకు ఆ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 224 మందికి ఫిజిక్స్లో నోబెల్ ఇచ్చారు.
ఇదిలావుంటే.. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు గాను సోమవారం నాడు ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటిస్తారు. శాంతి నోబెల్ బహుమతిని శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 14న ప్రకటించనున్నారు.
స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన తరువాత, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 10 లక్షల డాలర్లు) నగదు అందజేయబడుతుంది. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేస్తారు.