మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కర్ణాటకలో కేసు నమోదైంది. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ సెప్టెంబర్ 27న ఈ కేసు నమోదుచేశారు. ముడా అక్రమాలపై విచారణ చేపట్టిన సంబంధిత కోర్టు.. 3 నెలల్లో తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల లోకాయుక్తను ఆదేశించడంతో.. ఈ చర్యలు చేపట్టారు. స.హ. కార్యకర్త స్నేహమయి కృష్ణ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ తీర్పును వెల్లడించింది.
ఈ కేసులో ఏ1గా సీఎం సిద్ధరామయ్య, ఏ2గా ఆయన సతీమణి పార్వతి , ఏ3గా ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, అలాగే ఏ 4 గా భూములు విక్రయించిన దేవరాజు , ఏ5గా ఇతర నిందితులను పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై భూ ఆక్రమణల నియంత్రణ, అవినీతి నిరోధక, ఫోర్జరీ, బినామీ ఆస్తుల పరిరక్షణ, అధికార దుర్వినియోగం వంటి అభియోగాల కింద పలు సెక్షన్లు పెట్టారు.
అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తడం..సిద్ధరామయ్య రాజీనామా కోసం విపక్షాలు చేస్తున్న డిమాండ్పై శుక్రవారం ఉదయం ఆయన స్పందించారు. ‘గోద్రా కేసులో ఆనాటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. అక్రమ గనుల తవ్వకాల కేసులో బెయిల్పై ఉన్న కేంద్రమంత్రి కుమారస్వామిని రాజీనామా చేయాలని ఎవరైనా రాజీనామా కోరారా?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాదు తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
మరోవైపు కర్ణాటక సీఎం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడిన ఖర్గే.. కేసు నమోదు చేయగానే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోరని అన్నారు. గోద్రా కేసులో అప్పుపడు మోదీ రాజీనామా చేశారా అని ప్రశ్నించిన ఖర్గే..అంతెందుకు అమిత్ షా పైనా కేసులున్నాయి కదా ఆయన రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరణ చర్యను కూడా ఖర్గే సమర్థించారు.