కాలేజీ విద్యార్ధినులు హిజాబ్ ధరించడంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడానికి ముస్లిం విద్యార్థినులకు అనుమతించింది ధర్మాసనం. కాలేజీ క్యాంపస్లలో విద్యార్థినులు హిజాబ్లు ధరించడాన్ని నిషేధిస్తూ.. ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది.
హిజాబ్పై నిషేధాన్ని విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కాలేజీ యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసుపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన కూడా ధర్మాసనం స్టే విధించింది. విద్యార్థినులు ఏం ధరించాలో కాలేజీలే నిర్ణయిస్తే..ఇక మహిళా సాధికారికత మాటేంటని సూటిగా ప్రశ్నించింది.
కాలేజీలో అందరూ సమానమని, మతాల ప్రదర్శనకు కళాశాల వేదిక కాకూడదనే ఉద్దేశంతో మాత్రమే తాము హిజాబ్ ధరించడాన్ని నిషేధించామని.. కాలేజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. పేర్లల్లో కూడా మతం ఉంటుందని, మరి దాన్ని ఎలా తొలగిస్తారంటూ కళాశాల యాజమాన్యంపై కౌంటర్గా ప్రశ్నించింది.
అమ్మాయిలు ఏం ధరించాలనేది వారివారి వ్యక్తిగత నిర్ణయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైనే అవుతున్నా కూడా.. ఇప్పటికీ ఇలాంటి అంశాలపైన ఇలా చర్చ రావడం దురదృష్టకరమని ధర్మాసనం చెప్పింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎలాంటి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదని చెప్పిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.