పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకుల చేరిక కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా శనివారం నాడు సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్కతాలోని టీఎంసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా టీఎంసీ పార్టీ జెండా కప్పుకున్నారు. 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా చాలా సంవత్సరాల పాటుగా బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. 2018లో బీజేపీని వీడిన ఆయన, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, దేశం ఈ రోజున వింత పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రజాస్వామ్యం యొక్క బలం ప్రజాస్వామ్య సంస్థల బలంపై ఆధారపడి ఉంటుందని, అయితే న్యాయవ్యవస్థతో సహా ఈ సంస్థలన్నీ ఇప్పుడు బలహీనంగా మారాయని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఆపడానికి ఎవరూ లేరని అన్నారు. వాజపేయి కాలంలోని బీజేపీ ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, కాని నేటి ప్రభుత్వం అణిచివేత మరియు జయించడాన్నే నమ్ముతుందని చెప్పారు. మరోవైపు టీఎంసీ పార్టీలో చేరడానికి ముందు సీఎం మమతా బెనర్జీతో యశ్వంత్ సిన్హా భేటీ అయినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ