జనాభా క్షీణత ప్రపంచానికి రోజు రోజుకు మరింత తీవ్రమైన ముప్పుగా మారుతుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల నివేదిక చెబుతోంది. ఈ గ్రాఫ్ భారతదేశం, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్తో సహా ప్రధాన దేశాలకు 2018- 2100 మధ్య అంచనా వేసిన జనాభాలో చాలా పెద్ద తేడాలనే చూపిస్తుంది. నిజానికి జనాభా పెరుగుదల వల్ల వనరుల కొరత, ఆర్థిక సమస్యలు, ఆహారం, నీటి సమస్యల గురించి ఎన్నో తరాలు వింటూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం కాస్తా తలకిందులైంది. ప్రపంచంలోని చాలా దేశాలు జనాభా క్షీణతతో ఇబ్బంది పడుతున్నాయి.
అందుకే ఇప్పుడు చాలా దేశాలు జననాల రేటును పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చైనా, జపాన్లు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎలాన్ మస్క్ ప్రపంచ జనాభా క్షీణతను ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభివర్ణించారు. గ్రాఫ్ను ఉటంకిస్తూ, 2100 సంవత్సరం నాటికి జనాభాలో భారీగా క్షీణత ఉంటుందని, ఇది మొత్తం మానవాళికే పెద్ద ముప్పు అని మస్క్ చెప్పారు.
వివిధ దేశాలలో జనాభా తగ్గిపోవడం వెనుక కారణాలు జనన రేటు తగ్గుదల, వృద్ధుల జనాభా పెరుగుదల, వలసలు మొదలైనవని విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్నారు. అనేక దేశాల్లో ఒక మహిళకు సగటు పిల్లల సంఖ్య 2.1 కంటే తక్కువగా ఉంది. అయితే భారత్, చైనాలు ఈ సమస్యతో ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.
2018లో, భారతదేశం, చైనా రెండింటి జనాభా దాదాపు 150 కోట్లు, కానీ ఈ లెక్కలు వేగంగా మారుతున్నాయి. 2100 నాటికి భారతదేశ జనాభా 110 కోట్లకు తగ్గిపోతుందని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో, చైనా జనాభా అయితే దాదాపు 74 కోట్ల భయంకరమైన క్షీణతతో మిగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వృద్ధుల జనాభా పెరుగుదలతో పాటు సంతానోత్పత్తి రేటు బాగా తగ్గడం చైనా జనాభాలో ఇంత భారీ తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు చెబుుతున్నారు. ఈ విధంగా, ఈ శతాబ్దం చివరికి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం కాగా.. రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా అవుతుంది.
ఈ శతాబ్దం చివరి నాటికి నైజీరియా జనాభా 79 కోట్లు ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల నివేదిక అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో, చైనాలో జనాభా మునుపటి కంటే చాలా వేగంగా తగ్గుతుంది. అదే సమయంలో అమెరికా 2100 సంవత్సరం నాటికి జనాభా పరంగా ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంటుందని.. కెనడా, ఆస్ట్రేలియాలో జనాభా స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2100 సంవత్సరం నాటికి, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో కొంచెం తగ్గుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.