హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా..హైడ్రా విషయంలో ఒత్తిడి పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లాలని సీఎం రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ఇప్పటికే ఆక్రమించిన 111 ఎకరాలను తాము స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది.ఆక్రమణలను క్రమబద్దీకరించేది లేదని అటు సీఎం రేవంత్ తేల్చి చెప్పేశారు. ఇదే సమయంలో హైడ్రాకు మరిన్ని విశేషాధికారాలు ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఆర్దినెన్స్ పైన కసరత్తు జరుగుతోంది.
హైడ్రాకు మరింతగా అధికారాలను కల్పిస్తూ రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించనుంది. దీనికోసం తెలంగాణ భూ ఆక్రమణ చట్టం -1905 సవరణ కోసం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం కొత్త ఆర్డినెన్స్ తెచ్చేలా కసరత్తు జరుగుతోంది. రెవిన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ డిపార్టుమెంట్లకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను..కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా వచ్చిన అధికారాలను తాజాగా తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించడానికి రేవంత్ రంగం సిద్దం చేస్తున్నారు.
హైడ్రా ఏర్పాటు సమయంలోనే రేవంత్ ప్రభుత్వం విధులు..బాధ్యతలను ఖరారు చేసింది. అయితే, హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ వంటి విభాగాలు ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలోనే ఉన్నాయి. ఈ అధికారాలను చట్టం ద్వారా హైడ్రాకు ఇవ్వకపోతే హైడ్రా లక్ష్యమే దెబ్బ తింటుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, వివిధ శాఖలకు చట్టపరంగా దక్కిన కొన్ని అధికారాలను తొలిగిస్తూ.. వాటిని ఇప్పుడు హైడ్రాకు బదిలీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనిపైనే త్వరలో ఆర్డినెన్స్ తీసుకురానుంది.
హైడ్రాకు ప్రత్యేక అధికారాలు అప్పగించటంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి న్యాయవిభాగం పలు సూచనలు చేసింది. రెవిన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ వంటి శాఖలకున్న కొన్ని అధికారాలను బదలాయించటంతో పాటు హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని చెప్పింది. అంతేకాకుండా మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నివేదించింది. వీటి పైన ఇప్పటికే రేవంత్ రెడ్డి సంబంధిత శాఖలతో చర్చలు జరిపారు. వీటితో పాటు తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905కు సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం మంత్రివర్గం ఆమోదంతో ఆర్దినెన్స్ కు సిద్దమైంది.