తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్కం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు బుధవారం రాజీనామా లేఖను పంపారు. అనంతరం ఆయన స్థానంలో కొత్త ఇన్చార్జిగా మాణిక్రావ్ ఠాక్రేను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. కాగా మాణిక్కం ఠాగూర్కు గోవా బాధ్యతలను అప్పజెప్పింది అధిష్టానం. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే సీనియర్ నేత దినేష్ గుండురావు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఇన్చార్జిగా కొనసాగుతారని ఆయన వెల్లడించారు.
అయితే గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెలలో పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు బాధ్యతలు అప్పజెప్పింది హైకమాండ్. ఆయన రెండురోజులు రాష్ట్ర నేతలతో మాట్లాడి ఇక్కడి పరిస్థితిపై అధిష్టానానికి రిపోర్టు అందజేశారు. ఈ క్రమంలోనే తెలంగాణకి కొత్త ఇన్చార్జ్ని నియమించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లే మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో మాణిక్రావ్ ఠాక్రేను నియమించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో రేవంత్ రెడ్డి దూకుడుకు టీ-కాంగ్రెస్ సీనియర్లు కొంత వరకు అడ్డుకట్ట వేయగలిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE