సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురావట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరలను రద్దు చేసిన మీరు.. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.
మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2,500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అవ్వ, తాతలకు నెలకు 4,000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు?
మూసి నది వివాదం పై అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ తో పాటు హరీశ్రవు, ఈటల రాజేందర్ కి సవాల్ విసిరారు.. ముగ్గురూ సెక్రటేరియట్కు రావాలని, తాను, ఉపముఖ్యమంత్రి భట్టి కూర్చుని.. అధికారులందరినీ పిలిపించి.. మూసీ ప్రక్షాళణ కోసం రూపొందించిన ప్రణాళికలన్నీ వారికి వివరిస్తామని, ఆ తర్వాత మూసీ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలో వాళ్లే చెప్పాలని కోరారు. నష్టపరిహారం ఇవ్వాలా..? ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు కట్టించాలా..? లేదంటా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలా..? పిల్లలకు మంచి పాఠశాలలు నిర్మించాలా..? ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వాలో వాళ్లే సూచించాలని సవాల్ విసిరారు. లేదంటే ఇలానే వదిలేసి మూసీని మూసేయాలంటారేమో కూడా చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.