హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం నాడు ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు, కేంద్రం మార్గదర్శకాల అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రయాణకులను బట్టి రైళ్ల ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులు మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని, లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. ధర్మల్ స్కానింగ్ అనంతరం కరోనా అనుమానిత లక్షణాలు లేనివారిని మాత్రమే మెట్రోలో ప్రయాణానికి అనుమతిస్తామని ఎండీ తెలిపారు. మెట్రోలో విధులు నిర్వహించే ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేయనున్నారు.
హైదరాబాద్ లో మెట్రో రైళ్లు దశలవారీగా ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 7న కారిడార్-1 (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) పరిధిలో మెట్రో రైల్ సేవలు ప్రారంభం అవుతాయి. 7 AM నుంచి 12 PM వరకు, మరియు 4 PM నుంచి 9 PM వరకు రైళ్లు నడవనున్నాయి. సెప్టెంబర్ 8న కారిడార్-3 (నాగోల్ నుంచి రాయ్దుర్గ్) పరిధిలో, ఇక సెప్టెంబర్ 9 నుంచి అన్ని కారిడార్లలో రైళ్లు నడవనున్నాయి. ఈ మార్గాల్లో ప్రతి ఐదు నిమిషాలకు ఓ రైలు నడువనుంది. ప్రయాణికుల రద్దీని బట్టి సమయం తగ్గించడం లేదా పెంచడంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న గాంధీ హాస్పటల్, భరత్నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసఫ్గూడ మెట్రో స్టేషన్లను మూసివేయనున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu