ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. ఈ కేసులో సంబంధమున్న పలువురిని అరెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గురువారం ఎమ్మెల్సీ కవిత దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ప్రతిపక్షాల పార్టీలలోని నేతలను టార్గెట్ చేస్తున్నారని, కేంద్రం వైఫల్యాలపై ప్రశ్నిస్తే వారిపైకి దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం బీజేపీకి పరిపాటైందని విమర్శించారు. ఇక ఎవరిని ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందో.. బీజేపీ నేతలు కొందరు ముందే చెప్తున్నారని, దీనిని బట్టే వారి మధ్య బంధం ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ నేతలు చెప్పినట్లు అరెస్టులు చేస్తుంటే దర్యాప్తు సంస్థలు ఎందుకని, ఏ విచారణలోనైనా పారదర్శకత అవసరమని కవిత పేర్కొన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతిని భారత జగృతిగా మార్చామని, దీని ఆధ్వర్యంలో త్వరలో మొదటి కార్యక్రమం దేశరాజధాని ఢిల్లీలో చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ ఇస్తామని గత రెండు ఎన్నికల సందర్భంగా చెప్పిన బీజేపీ ఆ హామీ నిలబెట్టుకోలేదని, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కోరారు. అదికూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత జనాభా గణన చేయలేదని, దీనితో పాటు బీసీ గణన కూడా చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం ఎవరి హక్కులు వారికి రావాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE