ఫ్రీ కరెంట్ బిల్లు స్కీమ్పై తెలంగాణలో కీలక అప్ డేట్ ఒకటి వచ్చింది. ఫ్రీ కరెంట్ వినియోగదారులు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎలక్ట్రసిటీ అధికారులు తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉంటే..గృహజ్యోతి స్కీం కింద తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వినియోగించుకోవచ్చు.దీనిని జీరో కరెంట్ బిల్లుగా ఇస్తారు. దీనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఉచిత స్కీమ్ కింద ఇంకా ఎవరైనా చేరకపోతే..అలాంటి వారు నెల నెలా వచ్చే కరెంట్ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు తెలిపింది.
దీంతో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. బిల్లులు కట్టలేని ఇలాంటివారందరికీ ఇప్పుడు విద్యుత్ బిల్లు ఏకంగా 3వేలు, 4వేల రూపాయలు చూపిస్తుంది. ఉదాహరణకు వరంగల్ జిల్లాను తీసుకుంటే..ఈ జిల్లాలో కేటరిగీ 1 విద్యుత్తు మీటర్ల వినియోగదారులు 83వేల501 మంది ఉన్నారు. ఇప్పటి వరకు గృహజ్యోతి కస్టమర్లు 53వేల283 మంది పథకానికి అర్హులని గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 51వేల628 మంది కస్టమర్లకు జీరో బిల్లులు ఇచ్చారు.
ఇటు విద్యుత్ అధికారులు మాత్రం గృహజ్యోతి స్కీం వర్తించకముందు వచ్చిన బిల్లును మాత్రం తప్పనిసరిగా చెల్లించాలని చెబుతున్నారు. ఈ పథకానికి కంటే ముందు వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించాలని అంటున్నారు. దీంతో సర్కారు మాట విని బిల్లు కట్టకుండా ఉన్నామని..ఇప్పుడు వచ్చిన వేలకు వేల కరెంటు బిల్లులను ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.