సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ ప్రజలకు అలర్ట్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 6 నుంచి మొదలైన విషయం తెలిసిందే.
దీనిని ఆధారంగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడటానికి తెరతీసే అవకాశం ఉందని సూచించింది. దీనిలో భాగంగా..సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎవరైనా సైబర్ నేరగాళ్లు ఒటీపీలు అడిగితే చెప్పకూడదని తెలిపింది.
తెలంగాణ ప్రజలు ఇటువంటి వారి నుంచి జాగ్రత్త ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. సమగ్ర సర్వే పేరుతో ఎటువంటి లింకులు వచ్చినా కూడా వాటిని క్లిక్ చేయవద్దని సూచించింది. సమగ్ర విచారణ ఇంటింటికి నియమించిన ప్రత్యేక అధికారులే వస్తారని పేర్కొంది. మొత్తం సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్వైజర్లను నియమించిందని గుర్తు చేసింది. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 1930కు డయల్ చేయాలని కోరారు.
ఇటీవల ఎక్కువగా చదువుకున్నవాళ్లు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లే సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. రోజురోజుకు సైబర్ నేరగాళ్లు దర్జాగా లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు .తాజాగా ఈ కేటుగాళ్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజుకున్న దాఖలాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయి.. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ లు పంపినా నమ్మవద్దని తెలిపారు.