కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో గల గ్రామాల తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా.. ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అమ్రాబాద్,కవ్వాల్ టైగర్ రిజర్వులపై సుదీర్ఘ సమీక్షను చేపట్టిన మంత్రి కొండా సురేఖ.. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ.. పునరావాస చర్యలను విజయవంతంగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లు ..తెలంగాణకి ఎంతో ప్రత్యేకతను చేకూర్చాయని సురేఖ చెప్పుకొచ్చారు.
పెరుగుతున్న పులుల ఆహార లభ్యత కోసం.. జింకల సంఖ్యను పెంచేలా అటవీశాఖ చేపడుతున్న చర్యలపై సురేఖ హర్షం వ్యక్తం చేశారు. అక్కమహాదేవి గుహలకు తెలంగాణ ప్రభుత్వ పరంగా భూ, జలమార్గాల్లో యాత్రా సౌకర్యం కల్పించడానికి అవకాశాలను పరిశీలించాలని ఆమె అధికారులకు సూచించారు. నల్లమల అటవీప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతరను.. భవిష్యత్తులో అటవీశాఖ చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చే దిశగా ఇప్పుడు కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.
అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని 4 గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా అటవీ అధికారులు మంత్రికి వివరించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడెంలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల – దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో.. పర్యాటక సేవలు అందిస్తున్నట్లుగా మంత్రికి వివరించారు.
అలాగే వన్యప్రాణుల దాడుల్లో మరణించే వారికి పరిహారం 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడంపైన కూడా చర్చ జరిగింది. ఇలా మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి ఇస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.