తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విచారణలో భాగంగా.. విద్యా సంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, రాజధాని హైదరాబాద్ నగరంలో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కరోనా నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈక్రమంలో.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
అలాగే, ఈనెలలో జరుగనున్న మేడారం మహా జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అదే సమయంలో అమలు చేయాల్సిన కోవిడ్ నియంత్రణ చర్యలు గురించి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. మరోవైపు హైదరాబాద్ శివార్లలో మొదలైన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో.. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అక్కడ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వలన కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ముఖ్య బాధ్యత అని కోర్టు తెలిపింది. ఈ అంశాలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ