తెలంగాణలో రైతులకు అందించే పంట రుణమాఫీకి సంబంధించి .. అక్రమాలకు పాల్పడిన అధికారులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లకు, సంఘాల నుంచి పంపిన లిస్టులలో సహకార శాఖ అధికారులు వారికి చోటు లేకుండా చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పుడు 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలతో పాటు, కార్యదర్శులపై కూడా సస్పెన్షన్ వేటు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 105 పీఏసీఎస్లకు సంబంధించిన కార్యదర్శుల సహకార శాఖ సంజాయిషీని కోరింది రేవంత్ సర్కార్.
ఇటు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు విడతలుగా అర్హత గల రైతులకు లక్షన్నర వరకు రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే.. ఆగస్టు 15న మూడో విడతలో రైతుబంధు పథకం కింద రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. దీనిపై మాట్లాడిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజాలు లేవని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారని తెలిపారు.
కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా తమ సమస్యలు చెప్పాలని అంటున్నారంటూ చెప్పిన మంత్రి.. అదే వాట్సాప్ ద్వారా గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని వారికి రుణ మాఫీ చేస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీలో ఏది బాగోలేక పోయినా దానికి గత ప్రభుత్వమే కారణమని అన్నారు. వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే చేసిందని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా తమ ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని వివరించారు.
దయచేసి ఎవరూ రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని మంత్రి తుమ్మల సూచించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం చేసిన రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చినట్లు తుమ్మల చెప్పారు. నిజానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రైతుల రుణమాఫీ చేయాల్సి ఉందని… కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్లను పరిగణనలోకి తీసుకున్నామని వివరించాచు. పాస్ బుక్ లేకపోయినా, తెల్ల రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకున్నామని తుమ్మల అన్నారు. ఇప్పటికి 17 వేల రైతుల ఖాతాలకు సంబంధించిన సమస్యలను తాము పరిష్కరించామని అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గతంలో అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేని వారంతా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.