హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులను ఆపాలని హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిల్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కోరింది.హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పనులును కూడా మొదలుపెట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని చాం ద్రాయణ గుట్ట వరకు మెట్రోని విస్తరించేలా రేవంత్ సర్కార్ తాజాగా పనులు చేపట్టింది . అయితే తాజాగా హైదరాబాద్లోని పాతబస్తీలో మెట్రో పనులను వెంటనే ఆపాలంటూ హైకోర్టులో తాజాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఈ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మూడు వారాల సమయం కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇప్పటికే మెట్రో విస్తరణలో కీలకమైన భూసేకరణపై మెట్రో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కి.మీటర్ల పొడవైన మెట్రోను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్-2లో ఇది మొదటి కారిడార్ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించడానికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు.
దీనిలో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. మొదటి దశ ప్రైవేట్ ఆస్తులకు పరిహారాన్ని చెల్లించడం మొదలుపెట్టడంతో పాటు.. కొన్నిచోట్ల కూల్చివేతలు కూడా ప్రారంభించారు. మెట్రో ప్రాజెక్టు కోసం భూములు స్వచ్ఛందంగా ఇచ్చే యజమానులతో సంప్రదింపులు చేస్తూనే, మరోవైపు సమస్యాత్మక ఆస్తుల సేకరణపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణ పనులు ఆపాలంటూ పిల్ దాఖాలు కావడం చర్చనీయాంశంగా మారింది.