కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన చేవెళ్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ కారు స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతుల్లో లేదని, మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు లోపభూయిష్టంగా చేపట్టారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి వెనుకాడుతోందని, అయితే బీజేపీ మాత్రం అలా భయపడదని, తాము అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగా గెలవడమే కష్టమని, అలాంటిది ఆయన ఏకంగా ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీలో పీఎం కుర్చీ ఖాళీగా లేదని, 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని, అవినీతికి పాల్పడినవారు ఎంతటివారైనా వదిలేదని, తప్పక జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై పోరాడేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు కూడా వారు భయపడరని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగరబోయేది బీజేపీ జెండాయేనని, రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని, సీఎం కేసీఆర్ ఏంచేసినా దీనిని అడ్డుకోలేరని అమిత్ షా పేర్కొన్నారు.
ఇక అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసినందుకు, తనను పదో తరగతి ప్రశాపత్రాల లీకేజీలో అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా తనను అర్ధరాత్రి అరెస్ట్ చేసి రోడ్లపై తిప్పినప్పుడు కార్యకర్తలకు ఒక్కటే చెప్పానని.. ఎవరూ భయపడకండి, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. త్వరలో పులి వస్తుందని చెప్పానని గుర్తుచేశారు. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి అని, ఆ పులే నేడు చేవెళ్ల గడ్డకు వచ్చిందని, పులి వేటాడటం ప్రారంభించిందని, ఇప్పుడు వేట మొదలైందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు అమిత్షా ఆధ్వర్యంలో చేవెళ్లకు వచ్చామని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణను అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ హామీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE