బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖపేర్కొంది. కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దంటూ IMD హెచ్చరించింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. 17 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అల్పపీడనం గడిచిన మూడుగంటల్లో వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. కళింగపట్నం దక్షిణ-ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఒడిశా గోపాల్పూర్కు దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. తెలంగాణ లో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. హైదరాబాద్లో ఉదయం నుంచే ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మూడు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రయాణాలు కూడా మానుకుంటే మంచిదని సూచిస్తున్నారు. రానున్న 48 గంటల పాటు తెలంగాణలో 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది.. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ఇక దేశంలో సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 167మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొంది.