తాజాగా దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అర్హులైన వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్న రేవంత్ సర్కార్.. రేషన్ కార్డుల్లో మరిన్ని కీలక మార్పులను తీసుకువస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా.. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధి దారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పింది.
దీనిలో భాగంగానే ఉగాది రోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ కార్డు లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సన్న బియ్యం పథకం శాశ్వతంగా ఉంటుందని, ఈ పథకాన్ని రద్దు చేసే సాహసాన్ని ఎవరు చేయలేరని రేవంత్ చెప్పుకొచ్చారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా తెలంగాణలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో మరికొన్ని కీలక మార్పులు తీసుకు వస్తుంది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులకు బదులు రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న తెల్ల రేషన్ కార్డు స్థానంలో బీపీఎల్ లబ్ధిదారులకు మూడు రంగులతో కూడిన రేషన్ కార్డును ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీపీఎల్ కు ఎగువ నుండే లబ్ధిదారులకు మాత్రం గులాబీ కార్డు బదులుగా ఆకుపచ్చ కలర్లో రేషన్ కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం ఇలా కొత్తగా జారీ చేయబోయే రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు.. 2.85 కోట్ల లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. కొత్తగా మరో 30 లక్షల మందికి కూడా రేషన్ కార్డులు జారీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి కూడా అర్హులందరికీ తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సన్న బియ్యం పంపిణీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి 2,800 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతోంది. పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం పడతాయి. ఈ పథకం ద్వారా తెలంగాణలో 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని అందించబోతోంది రేవంత్ సర్కార్.